Thursday, January 12, 2023

చైతన్యగుప్తుని మేధస్సు


చైతన్యగుప్తుని మేధస్సు


మైథిలీపురి రాజ్యాన్ని చైతన్యగుప్తుడనే రాజు పరిపాలించేవాడు. అతను మేధావి అని దూరదేశాల వరకు మంచి పేరు సంపాదించాడు. చాణక్యపురి రాణి ప్రియంవదకు చైతన్యగుప్తుని మేధస్సు గురించి సమాచారం అందింది. అతని మేధస్సును పరీక్షించాలనుకుంది. 

ఒకరోజు నేరుగా మైథిలీపురికి బయలుదేరి చైతన్యగుప్తుని ఆస్థానానికి చేరుకుంది. చైతన్యగుప్తుడు రాణి ప్రియంవదను సాదరంగా ఆహ్వానించాడు.

ప్రియంవద, "రాజా! మీ మేధస్సు గురించి దేశ విదేశాలలో చర్చలు జరుగుతున్నాయి. స్వయంగా అది చూసిపోదామని వచ్చాను" అని తనతో తెచ్చిన రెండు పూలదండలు చైతన్య గుప్తునికి చూపించింది. 

"మహారాజా! ఈ రెండు దండలలో నిజమైన పూలతో అల్లిన దండ ఏదో కనిపెట్టగలరా?" అని అడిగింది. 

ఆ రెండు పూల దండలు ఒకేలా వున్నాయి. ఏది నిజమైన పూలతో అల్లిందో తెలుసుకోవడం చాల కష్టం. చైతన్యగుప్తుడు తదేకంగా కాసేపు దండలను గమనించాడు. 

కాసేపటి తరువాత "ఇదే అసలైన పూలతో కట్టిన దండ" అని చెప్పాడు. ప్రియంవద ఆశ్చర్యంగా "అదెలా కనిపెట్టారు మహారాజా" అని అడిగింది. 

"మహారాణి! రెండు దండలూ అచ్చంగా ఒకేలా ఉన్నప్పటికీ తేనెటీగలు ఆకర్షించేది అసలైన పూలదండే కదా! కిటికీలో నుంచి ఒక తేనెటీగ వచ్చి ఈ పూల దందా మీద వాలడం గమనించి ఇదే అసలైన పూలతో అల్లిన దండ  అని కనిపెట్టాను" అన్నాడు. 

దానితో రాణి ప్రియంవద చైతన్యగుప్తుని మేధస్సును కొనియాడింది. 



చివరి కోరిక


చివరి కోరిక

 సోమనాథపురంలో చంద్రగుప్తుడనే వర్తకుడుండేవాడు. అతను తను పండించిన ధాన్యాన్ని పక్కనే వున్నా కోసలనగరంలో జరిగే సంతలో అమ్మడానికి తీసుకువెళ్లాడు. మంచి ధర వచ్చి చాలా ధనం సంపాదించాడు. రాత్రి పూట అంత ధనంతో ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదని కోసల నగరంలో వున్న ఒక పూటకూళ్ళ ఇంట్లో దిగాలనుకున్నాడు. తీరా పూటకూళ్ళ ఇంటికి వెళ్లే సరికి ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో గది దొరకలేదు. ఆ పూటకూళ్ళ ఇంటి యజమాని మంచివాడు. చంద్రగుప్తుణ్ణి తన గదిలోనే ఉండమన్నాడు. 

ఆ రాత్రి ఒక దొంగ చంద్రగుప్తుడు, యజమాని పడుకున్న గదిలోకి దూరి చంద్రగుప్తుని ధనాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు. మెలకువ వచ్చిన పూటకూళ్ళ ఇంటి యజమాని అడ్డుకోబోతే దొంగ అతన్ని చంపేశాడు. ఈ గొడవకు పూటకూళ్ళ ఇంట్లో దిగిన యాత్రికులు నిద్రలేచారు. దొంగ కంగారుగా కిటికీలో నుండి పారిపోయాడు. ఆ గదిలోకి వచ్చిన యాత్రికులు యజమాని చనిపోవడం, చంద్రగుప్తుని వద్ద ధనం  చూసి పూటకూళ్ళ ఇంటి యజమానిని ధనం  కోసం చంద్రగుప్తుడే చంపాడని ఊహించి రాజభటులను పిలిపించారు. రాజభటులు చంద్రగుప్తుణ్ణి కోసలనగర మహారాజు వద్దకు తీసుకువెళ్లారు. చంద్రగుప్తుడు జరిగినదంతా వివరించినా మహారాజు నమ్మలేదు. చంద్రగుప్తుడిని ఉరి తీయమని తీర్పు ఇచ్చాడు. ఏ అపరాధికైనా ఉరి శిక్ష వేసే ముందు ఆఖరి కోరిక ఏమిటని అడగడం ఆనాటి పద్ధతి. 

మహారాజు చంద్రగుప్తుడిని "నీ ఆఖరి కోరిక ఏంటి?" అని అడిగాడు. చంద్రగుప్తుడు, తెలివిగా "నాకు శ్రావణ మాసంలో కురిసే వర్షంలో తడవాలని వుంది" అన్నాడు. అయితే అప్పుడు చలికాలం. వర్షాకాలానికి ఇంకా ఆరు నెలలుంది. కానీ అపరాధి ఆఖరి కోరిక తీర్చాల్సిందే. అందుకే మహారాజు ఆరు నెలల తరువాతే చంద్రగుప్తుని ఉరితీయమని ఆదేశించాడు. 

రెండు నెలల తరువాత అసలు దొంగ వేరే దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు. అతన్ని రాజభటులు నిలదీయగా పూటకూళ్ళ ఇంట్లో దొంగతనం చేయబోయి యజమానిని చంపింది తనేనని  ఒప్పుకున్నాడు. మహారాజుకు అసలు విషయం తెలిసి చంద్రగుప్తుడిని విడుదల చేసాడు. 

నిజమైన గెలుపు


నిజమైన గెలుపు

విక్రమసింహుడికి ప్రపంచాన్నంతా జయించి, తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాశ కలిగింది. అందుకోసం అనేక యుద్ధాలు చేసి, చాలా రాజ్యాలను జయించాడు. రక్తం ఏరులై పారిన రాజ్యకాంక్షతో దుర్మార్గంగా ప్రవర్తించసాగాడు. 

ఓ సారి మగధ రాజ్యంతో యుద్ధం చేసి, ఎంతోమందిని చంపి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. విజయగర్వంతో రాజుని బంధించి తీసుకుని వెళ్తుండగా, మార్గమధ్యంలో ఓ యువకుడు పాటలు పాడుకుంటూ, గుర్రంపై వెళ్తూ కనిపించాడు. విక్రమసింహుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ యువకుడిని ఆపాడు. 

"ఏరా! ఎప్పుడో ఈ రాజ్యాన్ని జయించాను. కనీసం గౌరవం లేకుండా నా ఎదురుగానే గుర్రపు స్వారీ చేస్తావా? నీకెంత గుండె ధైర్యం! ఎంత పొగరు!" అంటూ అరిచాడు. 

"అలాగా రాజా! మీరు అనుకున్నట్లు ఈ రాజ్యాన్నయితే జయించారు. కానీ  ఈ గుర్రాన్ని జయించారా? లేదు కదా! అందుకే ఈ గుర్రంపై ఎక్కి వస్తున్నాను" అన్నాడా యువకుడు తాపీగా. 

"ఏమిట్రా నీ అహంకారం! ఈ రాజ్యాన్ని జయిస్తే రాజ్యంలో వున్నా గుర్రాన్ని జయించినట్లు కూడా" అని గుడ్లురిమాడు రాజు. 

"కానే కాదు రాజా! మీరు ఈ రాజ్యాన్ని జయిస్తే నాకేంటి... జయించకపోతే నాకేంటి? ఈ గుర్రాన్ని మాత్రం నేనే జయించాను. ఇది నా మాటే వింటుంది. మీ మాట వినదు అంతే" అన్నాడు. 

రాజుకు చిర్రెత్తుకొచ్చింది. కోపం నషాళానికి ఎక్కింది. 

"ఈ రాజ్యాన్ని జయించాను కాబట్టి ఈ గుర్రం నా మాట వినక తప్పదు" అన్నాడు కరాఖండిగా. 

"ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు. కావాలంటే ఆ కొలనులోని నీటిని దానితో తాగించండి చూద్దాం" అని సవాలు విసిరాడు యువకుడు. 

రాజుకు పౌరుషం పెరిగింది. విసురుగా ఆ గుర్రం కళ్లెం చేతబుచ్చుకుని కొలనువైపు ఈడ్చుకెళ్లబోయాడు. గుర్రం అస్సలు కదలలేదు. 

"భటులారా! దీన్ని కొలను దగ్గరకు తోలుకుపోండి" అని ఆజ్ఞాపించాడు. 

భటులు బలవంతంగా గుర్రాన్ని లాక్కెళ్లారు. మహారాజు మీసం తిప్పి "చూసావా నా శక్తి" అన్నాడు. 

ఆ యువకుడు చిరునవ్వు నవ్వి, "అప్పుడే అయిపోయిందా? దానితో నీరు తాగించండి చూద్దాం" అన్నాడు. 

రాజు గుర్రాన్ని కొలనులో దింపించి దాని మూతిని బలవంతంగా నీటిలో ముంచాడు. 

"నీరు తాగు. తాగుతావా లేదా" అంటూ దానితో నీళ్లు తాగించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. గుర్రం తాగలేదు. 

"భటులరా! దీనికి బాగా పొగరులాగుంది. కొరడాలతో చితక్కొట్టి నీళ్లు తాగించండి." అని ఆజ్ఞాపించాడు. 

భటులు గుర్రాన్ని కొరడాలతో బాదారు. అయినా అది నీళ్లు తాగలేదు. 

"చూసారా రాజా! అది మీరెంత తిట్టినా కొట్టిన నీరు తాగదు. నేను చెబితేనే తాగుతుంది. ఎందుకంటే అది నాది" అన్నాడా యువకుడు. 

రాజుకేం చేయాలో అర్థం కాక మౌనంగా వుండిపోయాడు. ఆ యువకుడు గుర్రం దగ్గరకు పోయి, దాని తల నిమిరి, "నీరు తాగు" అన్నాడు. వెంటనే ఆ గుర్రం గటగటా నీరు తాగేసింది. 

రాజు సిగ్గుపడ్డాడు. తన ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించాడు. 

"శభాష్! నా కళ్ళు తెరిపించావు. రాజ్యాలను జయించాలన్న కాంక్షతో మానవత్వాన్ని మరిచాను. మనుషులనైనా, జంతువులనైనా జయించాలంటే ముందు వాటి మనసులను జయించాలని చెప్పకనే చెప్పావు. ఇకపై యుద్ధాలు చేయను గాక చేయను" అని చెప్పి, బంధించిన రాజును వదిలేసాడు. తనలో మార్పుకు కారణమైన యువకుడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చి సత్కరించాడు. 

 

Wednesday, January 11, 2023

కత్తి రంగు


కత్తి రంగు 

అవంతీపురాన్ని జయసేనుడు పరిపాలించాడు. పొరుగు రాజ్యమైన కౌసల్యను రణదీపుడు పాలించేవాడు. వారిద్దరి రాజవంశాల మధ్య తరతరాల నుండి శత్రుత్వం వుంది. ప్రతి చిన్న విషయానికి కత్తులు దూసేవారు. 

రెండు రాజ్యాల మంత్రులు వీరి చేష్టలకు విసిగిపోయారు. ఒక రోజు, వారు సమావేశమై వారి రాజుల మధ్య వైరాన్ని తొలగించేందుకు ఒక ఉపాయం ఆలోచించారు. దాని ప్రకారం రాజులకు రెండు దేశాల సరిహద్దు వద్ద వున్నా పెద్ద చెట్టు దగ్గరకు తీసుకుని రవళి. సమావేశం రోజు ఉదయం ప్రధానమంత్రులిద్దరూ చెట్టు కొమ్మకు ఒక కత్తి ఒరను వేలాడదీశారు.

అనుకున్న సమయానికి ఇద్దరు రాజులూ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు. కొద్ది దూరం నుండే ఒకరినొకరు చూసుకుని మొహాలు చిట్లించుకుని, వేలాడుతున్న ఒరను చూసారు. 

జయసేనుడు పరవశుడై ఇలా అన్నాడు "ఆహ! ఎంత అద్భుతమైన ఒర! వజ్రవైడూర్యాలు ఈ ఎర్రటి ఒరను మరింత అమూల్యమైనదిగా మార్చాయి."

బదులుగా రణదీపుడు "ఏం మాట్లాడుతున్నావ్? ఇది నిస్సందేహంగా అమూల్యమైనదే. కానీ ఇది తెలుపురంగుది నీవు చెప్పినట్లు ఎరుపురంగుది కాదు."

జయసేనుడు కరుకైన స్వరంతో, "నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావు. నేను చూస్తున్నాను కదా! అది ఎరుపు రంగుదే" అని అరిచాడు. 

రణదీపుడు కూడా సహనాన్ని కోల్పోయి "నీవు గుడ్డివాడివనుకుంటా. ఒర తెల్లగా వుంది, తెలుపు ముత్యాలు పొదగబడి వుంది" అన్నాడు. 

"నువ్వు నన్ను ఇక్కడకు కేవలం యుద్ధానికే పిలిచావనుకుంటా" జయసేనుడు తన కత్తి బయటకు లాగాడు. రణదీపుడు కూడా అంతే వేగంగా కత్తి బయటకు తీసాడు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ముందుకు దుమికారు. అంతే, పక్కనే పొదల మాటున దాక్కున్నా వారి ప్రధానమంత్రులు బయటకు వచ్చి ఇలా అన్నారు. "ఓ రాజుల్లారా! ఆగండి! పోట్లాడే ముందు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. 

"మీరు ఈ కత్తిని రెండు వైపుల నుండి చూడవలసింది. మీరిద్దరూ నిజమే చెబుతున్నారు. ఈ ఒర ఒకవైపు ఎరుపుగా మరోవైపు తెల్లగా వుంది."

"నిజమా!" రాజులు ఆశ్చర్యపోయారు. 

ప్రధానమంత్రులు ఇంకా ఇలా చెప్పసాగారు. "ఇప్పటి కత్తి విషయంలో జరిగినట్టు, యుద్ధాలు, సమరలు అనేవి అపార్ధాలకు పర్యవసానాలు."

ఇద్దరు రాజులూ వారి తప్పులను తెలుసుకొని సఖ్యతగా ఉండేందుకు చేతులు కలిపారు. 


మంచి పనుల డబ్బా!

మంచి పనుల డబ్బా! 


గోపాలుడనే బుద్ధిమంతుడైన కుర్రాడికి అతని నాన్నమ్మ ప్రతిరోజూ రకరకాల కథలు చెప్పి నిద్రపుచ్చేది. పాతాళలోకం కథలు, నాగలోకం కథలు, గంధర్వలోకం కథలను గోపాలుడు చాలా ఆసక్తిగా వినేవాడు. 

ఒక రోజు నాన్నమ్మ గోపాలుడికి స్వర్గ లోకం గురించి చెప్పింది. ఆ రోజు నుండి గోపాలునికి స్వర్గలోకం చూడాలని కోరిక పుట్టింది. నాన్నమ్మ అలా కుదరదు అని చెప్పిన ఒప్పుకోలేదు. 

ఒకరోజు రాత్రి నిద్రపోయే ముందు దేవుడిని స్వర్గలోకం చూపించమని ప్రార్థించి పడుకున్నాడు. రాత్రి కలలో దేవుడు కనిపించి "నీకు స్వర్గలోకం చూడాలని వుంది కదూ? నువ్వు సినిమా చూడాలన్న, సర్కస్ చూడాలన్న దానికి టిక్కెట్టు కొనాలి కదా అదే విధంగా స్వర్గలోకం చూడాలన్నా టిక్కెట్టు కొనాలి. అయితే స్వర్గంలో ఇక్కడి రూపాయలు చెల్లవు. అక్కడ మంచి పనుల రూపాయలు చెల్లుతాయి. ఈ డబ్బా నీ దగ్గర ఉంచుకో, నువ్వు చేసే ప్రతి మంచి పనికి ఈ డబ్బాలో ఒక నాణెం పుడుతుంది. నువ్వు చేసే ప్రతి చెడ్డ పనికి డబ్బాలో ఒక నాణెం తగ్గుతుంది. ఆ డబ్బా నిండిన రోజు నువ్వు స్వర్గం చూడవచ్చు." అని చెప్పాడు. 

మరునాడు పొద్దున్న లేచేసరికి అతనికి తన మంచం పక్కనే ఒక డబ్బా కనిపించింది. ఆ రోజు నుండి మంచి పనులు చేసినప్పుడల్లా ఆ డబ్బాలో ఒక నాణెం కనిపించేది. చెడ్డపనులు చేసినప్పుడల్లా ఆ డబ్బాలో ఒక నాణెం తగ్గేది. ఆలా ఆ డబ్బా దాదాపు నిండగా ఒక రోజు ఇంటి ముందు ఒక సాధువు వచ్చి గోపాలుడితో "బాబూ! నేను ముసలివాడినయ్యాను కానీ నా డబ్బా నాణాలతో నిండలేదు. నీ డబ్బా నాకిస్తావా?" అని అడిగాడు. అప్పుడు గోపాలుడు "బాబా నా డబ్బాని  నీకు సంతోషంగా ఇస్తాను." అని తన మంచి పనుల నాణేల డబ్బాను అతనికి ఇచ్చాడు. 

ఆ రోజు గోపాలునికి దేవుడు ప్రత్యక్షమై అతని నిస్వార్థ బుద్ధిని మెచ్చుకున్నాడు. కలలో స్వర్గదర్శన మిచ్చి "మనుషులు చేసే మంచి పనుల వాళ్ళ ఈ భూమిని స్వర్గంగా మార్చగలరు" అని చెప్పాడు. 


నక్క ఉపాయం


నక్క ఉపాయం

రామయ్య దగ్గర ఒక గుర్రం ఉండేది. అది ముసలిదయ్యింది. ముసలి గుర్రం తనకు పనికిరాదని, దానికి తిండి పెట్టడం వృథా అనుకున్నాడు రామయ్య. ఒక రోజు గుర్రంతో "నీకిప్పుడు బలం లేదు, నువ్వు నాకు పనికి రావు నువ్వు అడవికి వెళ్ళిపోయి నీ దారి నువ్వు చూసుకో. సింహం కన్నా బలశాలి అయిన రోజున మళ్ళీ రా" అని చెప్పి దాన్ని తరిమేశాడు.

గుర్రం ఏడుస్తూ ఒక చెట్టు కింద నిలబడింది. అక్కడికి ఒక నక్క వచ్చింది. నేస్తమా ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. దానికి గుర్రం జరిగిన విషయం చెప్పింది.

అప్పుడు నక్క "నువ్వు బాధపడకు, నేను ఒక ఉపాయం చెప్తాను. నేను చెప్పినట్టు చేయి. ఇక్కడే చచ్చిపోయినట్టు నటించు". అని చెప్పింది. గుర్రం అలానే చేసింది.

నక్క సింహం దగ్గరకు వెళ్లి "మన అడవి చివరిలో ఒక గుర్రం చచ్చి పడి వుంది. మనం దాన్ని తినచ్చు, వస్తావా?" అని అడిగింది. అప్పుడు సింహం అక్కడికి వచ్చింది. నక్క సింహంతో "ఇక్కడ మనుషులు అప్పుడప్పుడు తిరుగుతూ వుంటారు. మనం ఈ గుర్రాన్ని అడవిలోకి తీసుకెళ్లి తిందాం. నేను ఒక తాడుతో ఈ గుర్రం తోకను నీ తోకతో కడతాను. అడవిలోకి తీసుకెళ్లడానికి సులువుగా ఉంటుంది." అని ఇద్దరి తోకలని తాడుతో కట్టింది.

గుర్రం చెవిలో "పరిగెత్తు" అని మెల్లగా చెప్పింది. గుర్రం వేగంగా ముందుకు పరిగెత్తింది. ఇది ఊహించని సింహం కిందపడిపోయింది. గుర్రం సింహాన్ని ఈడ్చుకుంటూ తన యజమాని దగ్గరకు వెళ్ళింది. దానితో రామయ్య "నా గుర్రం బలశాలి" అనుకుని గుర్రాన్ని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు.


దురాశ - Greediness

 

దురాశ

ఇంద్రావతి నదీ తీరంలో సువర్ణపురి అనే రాజ్యాన్ని సోమనాథుడు అనే రాజు పాలించేవాడు. అతడు తరచూ రాజ్యమంతా పర్యటించేవాడు. ప్రజల కష్ట సుఖాలను విచారించి, అవసరమైన వారికి సహాయం చేసేవాడు. ఆ రాజ్యంలో రంగడనే యువకుడు ఉండేవాడు. అతడు చాల దురాశాపరుడు, సోమరి. కష్టపడి పని చేయక భిక్షాటనతోనే జీవనం సాగించేవాడు. 

రంగడు ఒక రోజు భిక్షాటన కోసం పొరుగూరు వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఒకామె రంగడి గిన్నె లో బియ్యం పోస్తూండగా, ఆ రోజు రాజు ఆ ఊళ్ళో పర్యటిస్తునట్టు తెలుసుకున్నాడు. గిన్నె నిండా బియ్యం చుస్తే రాజు తనకు ఏమీ దానం చేయకపోవచ్చని బియ్యం మొత్తం కింద పారబోసి ఖాళీ గిన్నెతో పరిగెత్తుకుంటూ రాజా దగ్గరికి వెళ్ళాడు. 

"మహారాజా ! మీరు చాలా దానధర్మాలు చేస్తారని విన్నాను. నేను చాలా పేదవాణ్ణి. చాలా రోజులుగా అన్నం కూడా తినలేదు అని రాజుతో చెప్పాడు రంగడు. 

బదులుగా రాజు... "నీ కష్టాలు చెప్పడం తప్పించి రాజుకి నువ్వు ఏమీ కానుక ఇవ్వలేవా?" అని అడిగాడు. రంగడి చేతిలోని గిన్నెలో ఐదు గింజలు మాత్రమే అంటుకుని వున్నాయి. వాటిని సోమనాథుడికి   ఇచ్చాడు. రాజు ఆ ఐదు బియ్యపు గింజలు తీసుకుని వెళ్ళిపోయాడు. 

"రాజు ఎంత పిసినారి. నా  దగ్గర ఐదు గింజలు తీసుకుపోయాడు" అని మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి రంగడు తిరిగి ఇంటికి వెళ్లేసరికి గుమ్మం ముందు ఒక బియ్యం బస్తా కనిపించింది. అందులో ఐదు బంగారు నాణేలు కూడా వున్నాయి. అది చూసి రంగడు ఎంతో సంతోషపడ్డాడు. 

"మహారాజు పిసినారి కాదు. నేనిచ్చిన ఐదు బియ్యవు గింజలకు బదులుగా ఐదు బంగారు నాణేలు ఇచ్చాడు. నేనే దురాశపడుడిని. విలువైన బహుమానాల ఆశతో చేతిలో వున్న బియ్యాన్ని నేలపాలు చేశాను. ఆ మొత్తం బియ్యం కనుక మహారాజుకి ఇచ్చి ఉంటే బస్తా నిండా బంగారు నాణేలు ఉండేవి. న దురాశకు తగిన శాస్తి జరిగింది" అని బాధపడ్డాడు రంగడు. 

నీతి: దురాశ దుఃఖానికి చేటు.