బుద్ధిబలం
పూర్వం ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమసేనుడు పాలించేవాడు. అతడు రాజ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. కానీ ప్రజల్లో రోజురోజుకీ స్వార్ధం పెరికిపోతోందనీ, పరోపకారం చేసేవారే కరవయ్యారనీ తెలుసుకున్నాడు. తన బుద్ధిబలంతో దీనికి ఓ చక్కని పరిష్కారం చూపాలనుకున్నాడు రాజు.
ఉజ్జయిని ప్రధాన కూడలిలో ఓ అర్థరాత్రి భటులచేత ఓ బండ రాయిని పెట్టించాడు విక్రమసేనుడు. ఉదయాన్నే ఆ తోవన వెళ్లిన షావుకారు గుర్రపు బండి రాయిని ఢీ కొట్టబోయింది. బండి నడిపేవాడు ఆ రాయిని తియ్యడానికి దిగబోయేసరికి, "మనకు వేరేపని వుంది నడు" అని వాడిని అడ్డుకున్నాడు షావుకారు. తరువాత కాసేపటికి ఆ దారినే వచ్చిన మరొకడు ఆ రాయి తగిలి పడబోయి రాజునీ, రాజ్యాన్నీ తిట్టుకున్నాడు తప్ప దాన్ని పక్కకు పెట్టడం గురించి ఆలోచించలేదు.
మరి కాసేపటికి అటుగా వెళ్లిన ఓ రైతు రాయిని పక్కకు జరపాలనుకున్నాడు. కానీ, ఒక్కడికీ సాధ్య పడలేదు. దాంతో అటుగా వెళ్తున్న ఓ పండితుణ్ణి సాయం చేయమని అడిగాడు. "నేను పండితుణ్ణి. నా బుద్ధిబలానికి పని చెప్పు చేస్తాను. కానీ ఈ పని చేయడం నాకు అవమానం" అని చెప్పి వెళ్ళిపోయాడు. మరో ఇద్దరు బాటసారుల నుంచీ ఇలాంటి సమాధానమే రావడంతో ఆఖరికి రైతు ఒక్కడే కష్టపడి రాయిని దారిలోంచి పక్కకు తొలగించాడు. ఆ రాయిని తొలగించాక రైతుకి ఓ సంచి కనిపించింది. దానిలో కొంత డబ్బు, ఒక చీటీ వున్నాయి. చీటీ పై, "రాయి తొలిగించిన వారికీ ఇది రాజుగారి బహుమతి" అని రాసుంది.
ఆ విషయం ఆనోటా ఈనోటా అందరికీ తెలిసింది. దాని వెనుక అసలు కారణం పరోపకార గుణాన్ని పెంచుకోవాలని గుర్తుచేయడమేనని తెలుసుకొన్నారు ప్రజలంతా. అప్పటినుంచి తమ పనులు చేసుకోవడమే కాకుండా రాజ్యానికి ఉపయోగపడే పనుల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.
No comments:
Post a Comment