Wednesday, January 11, 2023

నక్క ఉపాయం


నక్క ఉపాయం

రామయ్య దగ్గర ఒక గుర్రం ఉండేది. అది ముసలిదయ్యింది. ముసలి గుర్రం తనకు పనికిరాదని, దానికి తిండి పెట్టడం వృథా అనుకున్నాడు రామయ్య. ఒక రోజు గుర్రంతో "నీకిప్పుడు బలం లేదు, నువ్వు నాకు పనికి రావు నువ్వు అడవికి వెళ్ళిపోయి నీ దారి నువ్వు చూసుకో. సింహం కన్నా బలశాలి అయిన రోజున మళ్ళీ రా" అని చెప్పి దాన్ని తరిమేశాడు.

గుర్రం ఏడుస్తూ ఒక చెట్టు కింద నిలబడింది. అక్కడికి ఒక నక్క వచ్చింది. నేస్తమా ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. దానికి గుర్రం జరిగిన విషయం చెప్పింది.

అప్పుడు నక్క "నువ్వు బాధపడకు, నేను ఒక ఉపాయం చెప్తాను. నేను చెప్పినట్టు చేయి. ఇక్కడే చచ్చిపోయినట్టు నటించు". అని చెప్పింది. గుర్రం అలానే చేసింది.

నక్క సింహం దగ్గరకు వెళ్లి "మన అడవి చివరిలో ఒక గుర్రం చచ్చి పడి వుంది. మనం దాన్ని తినచ్చు, వస్తావా?" అని అడిగింది. అప్పుడు సింహం అక్కడికి వచ్చింది. నక్క సింహంతో "ఇక్కడ మనుషులు అప్పుడప్పుడు తిరుగుతూ వుంటారు. మనం ఈ గుర్రాన్ని అడవిలోకి తీసుకెళ్లి తిందాం. నేను ఒక తాడుతో ఈ గుర్రం తోకను నీ తోకతో కడతాను. అడవిలోకి తీసుకెళ్లడానికి సులువుగా ఉంటుంది." అని ఇద్దరి తోకలని తాడుతో కట్టింది.

గుర్రం చెవిలో "పరిగెత్తు" అని మెల్లగా చెప్పింది. గుర్రం వేగంగా ముందుకు పరిగెత్తింది. ఇది ఊహించని సింహం కిందపడిపోయింది. గుర్రం సింహాన్ని ఈడ్చుకుంటూ తన యజమాని దగ్గరకు వెళ్ళింది. దానితో రామయ్య "నా గుర్రం బలశాలి" అనుకుని గుర్రాన్ని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు.


No comments:

Post a Comment