నిజమైన గెలుపు
విక్రమసింహుడికి ప్రపంచాన్నంతా జయించి, తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాశ కలిగింది. అందుకోసం అనేక యుద్ధాలు చేసి, చాలా రాజ్యాలను జయించాడు. రక్తం ఏరులై పారిన రాజ్యకాంక్షతో దుర్మార్గంగా ప్రవర్తించసాగాడు.
ఓ సారి మగధ రాజ్యంతో యుద్ధం చేసి, ఎంతోమందిని చంపి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. విజయగర్వంతో రాజుని బంధించి తీసుకుని వెళ్తుండగా, మార్గమధ్యంలో ఓ యువకుడు పాటలు పాడుకుంటూ, గుర్రంపై వెళ్తూ కనిపించాడు. విక్రమసింహుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ యువకుడిని ఆపాడు.
"ఏరా! ఎప్పుడో ఈ రాజ్యాన్ని జయించాను. కనీసం గౌరవం లేకుండా నా ఎదురుగానే గుర్రపు స్వారీ చేస్తావా? నీకెంత గుండె ధైర్యం! ఎంత పొగరు!" అంటూ అరిచాడు.
"అలాగా రాజా! మీరు అనుకున్నట్లు ఈ రాజ్యాన్నయితే జయించారు. కానీ ఈ గుర్రాన్ని జయించారా? లేదు కదా! అందుకే ఈ గుర్రంపై ఎక్కి వస్తున్నాను" అన్నాడా యువకుడు తాపీగా.
"ఏమిట్రా నీ అహంకారం! ఈ రాజ్యాన్ని జయిస్తే రాజ్యంలో వున్నా గుర్రాన్ని జయించినట్లు కూడా" అని గుడ్లురిమాడు రాజు.
"కానే కాదు రాజా! మీరు ఈ రాజ్యాన్ని జయిస్తే నాకేంటి... జయించకపోతే నాకేంటి? ఈ గుర్రాన్ని మాత్రం నేనే జయించాను. ఇది నా మాటే వింటుంది. మీ మాట వినదు అంతే" అన్నాడు.
రాజుకు చిర్రెత్తుకొచ్చింది. కోపం నషాళానికి ఎక్కింది.
"ఈ రాజ్యాన్ని జయించాను కాబట్టి ఈ గుర్రం నా మాట వినక తప్పదు" అన్నాడు కరాఖండిగా.
"ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు. కావాలంటే ఆ కొలనులోని నీటిని దానితో తాగించండి చూద్దాం" అని సవాలు విసిరాడు యువకుడు.
రాజుకు పౌరుషం పెరిగింది. విసురుగా ఆ గుర్రం కళ్లెం చేతబుచ్చుకుని కొలనువైపు ఈడ్చుకెళ్లబోయాడు. గుర్రం అస్సలు కదలలేదు.
"భటులారా! దీన్ని కొలను దగ్గరకు తోలుకుపోండి" అని ఆజ్ఞాపించాడు.
భటులు బలవంతంగా గుర్రాన్ని లాక్కెళ్లారు. మహారాజు మీసం తిప్పి "చూసావా నా శక్తి" అన్నాడు.
ఆ యువకుడు చిరునవ్వు నవ్వి, "అప్పుడే అయిపోయిందా? దానితో నీరు తాగించండి చూద్దాం" అన్నాడు.
రాజు గుర్రాన్ని కొలనులో దింపించి దాని మూతిని బలవంతంగా నీటిలో ముంచాడు.
"నీరు తాగు. తాగుతావా లేదా" అంటూ దానితో నీళ్లు తాగించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. గుర్రం తాగలేదు.
"భటులరా! దీనికి బాగా పొగరులాగుంది. కొరడాలతో చితక్కొట్టి నీళ్లు తాగించండి." అని ఆజ్ఞాపించాడు.
భటులు గుర్రాన్ని కొరడాలతో బాదారు. అయినా అది నీళ్లు తాగలేదు.
"చూసారా రాజా! అది మీరెంత తిట్టినా కొట్టిన నీరు తాగదు. నేను చెబితేనే తాగుతుంది. ఎందుకంటే అది నాది" అన్నాడా యువకుడు.
రాజుకేం చేయాలో అర్థం కాక మౌనంగా వుండిపోయాడు. ఆ యువకుడు గుర్రం దగ్గరకు పోయి, దాని తల నిమిరి, "నీరు తాగు" అన్నాడు. వెంటనే ఆ గుర్రం గటగటా నీరు తాగేసింది.
రాజు సిగ్గుపడ్డాడు. తన ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించాడు.
"శభాష్! నా కళ్ళు తెరిపించావు. రాజ్యాలను జయించాలన్న కాంక్షతో మానవత్వాన్ని మరిచాను. మనుషులనైనా, జంతువులనైనా జయించాలంటే ముందు వాటి మనసులను జయించాలని చెప్పకనే చెప్పావు. ఇకపై యుద్ధాలు చేయను గాక చేయను" అని చెప్పి, బంధించిన రాజును వదిలేసాడు. తనలో మార్పుకు కారణమైన యువకుడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చి సత్కరించాడు.
No comments:
Post a Comment