Friday, January 6, 2023

కుశలుడి నిజాయితీ


కుశలుడి నిజాయితీ

పూర్వం భజరంగిపురం అనే రాజ్యంలో కుశలుడు అనే తెలివైన మంత్రి ఉండేవాడు. కుశలుడు పేరుకు తగ్గట్టే ఎంతో తెలివైన వాడే కాకుండా నిజాయితీ పరుడు, నమ్మదగినవాడు కూడా. 

ఒకరోజు కుశలుడి ఇంటికి పొరుగు రాజ్యంలో నివసిస్తున్న ఆయన మేనల్లుడు వచ్చాడు. ఒక సాయంత్రం వారిద్దరూ సరదాగా నగరంలో ఆలా నడుచుకుంటూ వెళుతుండగా, మాటల సందర్భంలో "మామయ్య, మీ రాజు దగ్గర ఎన్ని గుర్రాలు, ఏనుగులు ఉన్నాయో చెప్పగలవా? అసలు మీకున్న సైనిక శక్తి ఏపాటిది?" అని అడిగాడు కుశలుడి మేనల్లుడు. 

"ఈ విషయాలు నువ్విలా నన్ను అడగడం, నేను వివరాలు చెప్పడం సముచితం కాదు" అని జవాబిచ్చాడు కుశలుడు. 

"కానీ మామయ్య నేను నీ మేనల్లుడిని. నువ్వు నన్ను నమ్మటం లేదా? నేను నీ స్వంత కుటుంబంలోని మనిషిని. మన వంశం నిజాయితీకి, నమ్మకానికి మారుపేరు. నువ్వు చెప్పిన విషయాలు నేను రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేస్తున్నాను. నా కంఠంలో ప్రాణముండగా ఈ విషయాలు నేను మరొకరికి చెప్పను" అన్నాడు కుశలుడి మేనల్లుడు. 

"నువ్వు నా వంశానికి చెంది ఉండటం నాకు సంతోషకరమైన విషయమే. అయితే నాకు నా కుటుంబం కంటే రాజ్యమే ముఖ్యమని రాజ్యానికి సంభందించిన వివరాలు నా కుటుంబ సభ్యుల ముందైనా నోరు విప్పనని నేను మా రాజుకు మాటిచ్చాను. నీ మామ నిజాయితీ చూసి నువ్వు గర్వపడతావని అనుకుంటాను" అని ఎంతో సౌమ్యంగా చెప్పాడు కుశలుడు. 

దానితో కుశలుడి మేనల్లుడు నిరాశతో తన దేశానికీ తిరిగి వెళ్ళిపోయాడు. 


No comments:

Post a Comment