పేరులేని పక్షి
ఒక అడవిలో రకరకాలైన పక్షులుండేవి. అవన్నీ ఒకరోజు తమలో ఒక రాజుని ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటుచేసుకున్నాయి. "ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు" అని నిర్ణయించాయి.
ఒక పేరు లేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది. అన్ని పక్షులు ఎగరడం మొదలు పెట్టాయి. అన్నిటి కన్నా గద్ద చాలా పైకి ఎగిరింది. అన్ని పక్షులు "గద్దే రాజు" అని అంటూ ఉండగా హఠాత్తుగా ఆ గద్ద రెక్కలలో దాక్కున్న ఆ పేరు లేని పక్షి ఇంకా పైకి ఎగిరింది. గద్ద అప్పటికే ఆయాస పడటం వల్ల ఎగరలేకపోయింది.
పేరులేని పక్షి "నేనే రాజు, నేనే రాజు" అని సంబరపడింది. పక్షులకు అది మోసం చేసిందని తెలిసి "ఎవరు నీటిలో లోతుగా వెళ్లగలరో వారే రాజు" అన్నాయి. బాతు నీటిలోపలికి వెళ్ళింది. చాలా లోతుకు వెళ్ళింది అనుకునేసరికి పేరు లేని పక్షి మళ్ళీ బాతు రెక్కల నుండి బయటపడి ఇంకా లోపలి వెళ్లి "నేనే గెలిచాం, నేనే రాజుని" అనడం మొదలుపెట్టింది. మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చక దానిని ఒక పొలంలో బంధించి ఒక గుడ్లగూబను కాపలాగా పెట్టారు.
గుడ్లగూబ కష్టపడి నిద్రలేక కాపలా కాసింది కానీ ఒక్క క్షణం కునుకు పట్టింది. అప్పుడు పేరు లేని పక్షి మాయమైంది. అన్ని పక్షులు గుడ్లగూబను నిలదీశాయి. అందుకే గుడ్లగూబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు.
No comments:
Post a Comment