Wednesday, January 11, 2023

ఎద్దు - గాడిద (Ox and Donkey)

ఎద్దు - గాడిద

కిట్టయ్య అనే రైతు దగ్గర ఒక ఎద్దు ఉండేది. దానితో అతడు పొలం దున్నడం, బండిలాగడం చేసేవాడు. ఈ  పనులతో రోజూ ఎద్దు అలసిపోయేది. తన దుస్థితికి యజమానిని రోజూ మనసులోనే తిట్టుకునేది. 

 కొన్ని రోజుల తరువాత కిట్టయ్య ఒక  గాడిదను కొనుక్కొచ్చి కొట్టంలో కట్టాడు. ఆ రోజు సాయంత్రం కొట్టంలో గాడిద ఎద్దుతో మాట్లాడుతూ... " ఎలా వున్నావు మిత్రమా ?యజమాని నిన్ను బాగా చూసుకుంటాడా?" అని అడిగింది. 

"లేదు మిత్రమా, నన్ను ప్రతి రోజూ కొడతాడు. పొద్దస్తమానం నాతో ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటాడు" అంది. 

"పని తప్పేలా నేనొక ఉపాయం చెప్పనా?" అని అడిగింది గాడిద. 

నువ్వు ఏం చెప్పినా అది తప్పకుండా చేస్తాను మిత్రమా" అని బదులిచ్చింది ఎద్దు. 

"నువ్వు జబ్బు పడ్డట్టుగా నటించు. గడ్డి తినకు, కుడితి తాగకు. అలా చేస్తే నీకు నిజంగానే ఆరోగ్యం బాగాలేదు అనుకుంటాడు. జాలిపడి నిన్ను పనికి తీసుకెళ్లడు" అని సలహా ఇచ్చింది గాడిద. ఆ సలహా ప్రకారం మర్నాడు ఎద్దు మేత మేయలేదు, కుడితి తాగలేదు. కనీసం నిలబడలేనట్టు నటించింది. ఎద్దు పరిస్థితి చూసాక యజమాని దాన్ని ఏమీ అనకుండా వదిలేసాడు. 

రెండోరోజు కూడా ఎద్దు అలాగే చేసింది. రైతు దాని జబ్బు ఇంకా తగ్గలేదు అనుకుని సగంలో నిలిచిన పనిని పూర్తి చేయడానికి గాడిదను పొలానికి తీసుకెళ్లాడు. అలవాటులేని పని కావడంతో పొలం దున్నిన గాడిద బాగా అలసిపోయింది. "ఓరి దేవుడో! ఈ చాకిరీ నేనెక్కడ చేస్తాను. పని ఎగ్గొట్టడానికి ఎద్దుకు ఉపాయం చెబితే అది నా  మెడకు చిక్కుకుంది. అబద్ధం చెప్పడమే కాదు, అబద్ధం చెప్పమని ఎవరికైనా సలహా ఇవ్వడం కూడా చాల తప్పు. ఇంకెప్పుడూ  ఇలాంటి తెలివి తక్కువ పని చేసి కష్టాలు కొనితెచ్చుకోను" అనుకుంది బుద్దిగా. 

నీతి: అబద్ధం చెప్పడమే కాదు, అబద్ధం చెప్పమని ఎవరికైనా సలహా ఇవ్వడం కూడా చాల తప్పు


Monday, January 9, 2023

ధర్మరాజు

 ధర్మరాజు


ఒకానొక పల్లెటూరిలో నరసింహ అనే రైతు ఉండేవాడు. ఆటను చాల అహంకారి, కోపిష్టి. ఊరిలో అందరితో తగవు పెట్టుకునే వాడు. ఊరిలో ఎవరితోనూ స్నేహంగా ఉండేవాడు కాదు. కోపం వచ్చినపుడు చేయి చేసుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదు. 

ఒక రోజు ఆ ఊరికి ధర్మరాజు అనే రైతు వచ్చాడు. ఊరిలో జనమంతా అతనితో "నువ్వు నరసింహ జోలికి వెళ్ళకు, అతను చాల చెడ్డవాడు, అతనితో స్నేహం చేయకు" అని సలహా ఇచ్చారు. కానీ ధర్మరాజు మంచి స్వభావం కలవాడు కనుక అతనితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నరసింహ ప్రతిసారి ధర్మరాజును అవమానించి, తగువులాడి పంపించాడు. ఊరిజనమంతా ధర్మరాజుతో "చూసావా మేము చెప్పింది ఇప్పటికైనా అర్థమైందా?" అని అడిగారు. దానికి ధర్మరాజు " అందుకే నేను సమయం చూసి నరసింహను చంపుతాను" అని చెప్పాడు. 

ఒక రోజు నరసింహ పక్క ఊరికి ఎడ్ల బండి మీద వెళ్ళాడు. జోరుగా వర్షం కురిసింది. తను ఊరికి  తిరిగి వస్తూ ఉండగా చీకటి పడింది. బంక మట్టిలో బండి చక్రం ఇరుక్కుపోయింది. ఇక తానూ ఆ రాత్రికి ఊరు చేరుకోగలనే నమ్మకం కూడా లేక పోయింది నరసింహకు. ఊరిలో వారందరికీ నరసింహ తిరిగి రాలేదన్న విషయం తెలిసిన ఎవ్వరు సహాయం చేయడానికి లేదా అతన్ని వెతకడానికి ప్రయత్నించలేదు. 

ధర్మరాజు బండి చిక్కుకున్న ప్రాంతానికి బయలుదేరాడు. ఊరిజనమంతా ఆ అహంకారికి సహాయం చేయడం అనవసరం అన్నారు. అప్పుడు ధర్మరాజు "నేను అతనికి సహాయం చేయడానికి కాదు, చంపడానికి వెళ్తున్నాను" అన్నాడు. కానీ వెళ్లి నరసింహను ఆపద నుండి రక్షించాడు. నరసింహ సిగ్గుతో తలా వంచుకున్నాడు. 

జనమంతా ధర్మరాజును "నరసింహాను చంపుతావని వెళ్ళావు ఏమైంది?" అని అడగగా ధర్మరాజు "నేను చంపుతాను అన్నది నరసింహాను కాదు అతని అహంకారాన్ని" అని సమాధానమిచ్చాడు. 



Friday, January 6, 2023

పట్టుబడిన నటుడు

 పట్టుబడిన నటుడు


రవివర్మ ఆస్థానంలో గణపతిశాస్త్రి అనే మంత్రి ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు. తెలివి, సమయస్ఫూర్తితో ప్రజల వివాదాలను తీర్చేవాడు. 

ఒకరోజు భీమసేనుడనే వర్తకుడు గణపతిశాస్త్రి వద్దకు వచ్చి "అయ్యా! నేను సుధనుడనే నటుడికి కష్టకాలంలో ధనమిచ్చి సహాయం చేశాను. ఇప్పుడు అతను స్థితిమంతుడయ్యాడు. నేను నా అప్పు తీర్చమని చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగాను. కానీ విచిత్రమేమిటంటే నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా అతనిని పోలిన ఐదుగురు వ్యక్తులు కనిపిస్తారు. ఎవరిని పలకరించిన నేను సుధనుడు కాదంటే నేను కాదని అంటున్నారు. ఎవరిని ధనం  అడగాలో తెలీడం లేదు" అన్నాడు. 

గణపతిశాస్త్రికి ఈ  విచిత్రమైన సమస్య పట్ల కుతూహలం కలిగింది. మరునాడు భీమసేనుడితో సుధనుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుధానుని పోలిన నలుగురు ఒకే వేషధారణతో వున్నారు.

గణపతిశాస్త్రి "మీ అందరి వేషధారణ చాల బాగుంది. అందరు ఒకేలా వున్నారు. మీలో సుధనుడేవరో కనిపెట్టడం చాలా కష్టమే. కాకపోతే ఒక చిన్న తప్పు చేసారు. ఆ తేడా వాళ్ళ కనిపెట్టడం కష్టం కాదు అన్నాడు. 

ఆ మాటలు విన్న నిజమైన సుధనుడికి తాను వేయించిన వేషధారణలో చేసిన తప్పేమిటో తెలుసుకునే ఆత్రుత కలిగింది. వెంటనే "తప్పా! ఎక్కడ? ఏం తేడా కనిపిస్తుంది?" అని అడిగాడు. 

గణపతిశాస్త్రికి వెంటనే సుధనుడు ఎవరో తెలిసిపోయింది. "నువ్వేగా నిజమైన సుధనుడివి" చిన్నగా నవ్వుతూ అడిగాడు. సుధనుడు  అవునన్నట్లు తలూపాడు. తమ పనితనం గురించి తప్పు పట్టినప్పుడు ఆ తప్పేమిటో తెలుసుకునే ఆత్రుత ఎవరికైనా ఉంటుంది. ఆ మెలికను కనిపెట్టి గణపతిశాస్త్రి సుధనుడు  ఎవరో గుర్తుపట్టాడు. భీమసేనుడికి ధనాన్ని తిరిగి ఇప్పించాడు. 



పేరులేని పక్షి - Nameless Bird

 

పేరులేని పక్షి 


ఒక అడవిలో రకరకాలైన పక్షులుండేవి. అవన్నీ ఒకరోజు తమలో ఒక రాజుని ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటుచేసుకున్నాయి. "ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు" అని నిర్ణయించాయి. 

ఒక పేరు లేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది. అన్ని పక్షులు ఎగరడం మొదలు పెట్టాయి. అన్నిటి కన్నా గద్ద చాలా పైకి ఎగిరింది. అన్ని పక్షులు "గద్దే రాజు" అని అంటూ ఉండగా హఠాత్తుగా ఆ గద్ద  రెక్కలలో దాక్కున్న ఆ పేరు లేని పక్షి ఇంకా పైకి ఎగిరింది. గద్ద  అప్పటికే ఆయాస పడటం వల్ల ఎగరలేకపోయింది. 

పేరులేని పక్షి "నేనే రాజు, నేనే రాజు" అని సంబరపడింది. పక్షులకు అది మోసం చేసిందని తెలిసి "ఎవరు నీటిలో లోతుగా వెళ్లగలరో వారే రాజు" అన్నాయి. బాతు నీటిలోపలికి వెళ్ళింది. చాలా లోతుకు వెళ్ళింది అనుకునేసరికి పేరు లేని పక్షి మళ్ళీ బాతు రెక్కల నుండి బయటపడి ఇంకా లోపలి వెళ్లి "నేనే గెలిచాం, నేనే రాజుని" అనడం మొదలుపెట్టింది. మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చక దానిని ఒక పొలంలో బంధించి ఒక గుడ్లగూబను కాపలాగా పెట్టారు. 

గుడ్లగూబ కష్టపడి నిద్రలేక కాపలా కాసింది కానీ ఒక్క క్షణం కునుకు పట్టింది. అప్పుడు పేరు లేని పక్షి మాయమైంది. అన్ని పక్షులు గుడ్లగూబను నిలదీశాయి. అందుకే గుడ్లగూబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు.  

విలువైన కానుక - Valuable Gift

 

విలువైన కానుక 

ఒక ఊరి చివర గుడిసెలో విమలమ్మ తన కొడుకు రాధీశ్ తో నివసించేది. తండ్రి లేనందువల్ల కొడుకును కష్టపడి పెంచింది. రాధీశ్ చాలా బుద్ధిమంతుడు. మంచి విద్యాభ్యాసం కోసం విమలమ్మ తన కొడుకుని పక్క ఊరిలో వున్న గురువుగారి దగ్గరికి పంపించేది. రోజూ ఆశ్రమానికి వెళ్లాలంటే అడవి దాటవలసి వచ్చేది. "అమ్మా! నాకు ఒంటరిగా అడవి దాటాలంటే భయం" అన్నాడు రాధీశ్. అందుకు విమలమ్మ "బాబు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడెప్పుడు మనతోనే ఉంటాడు. నువ్వు పిలిచినప్పుడు తప్పకుండ వస్తాడు" అని చెప్పింది. 

ఒక రోజు రాధీశ్ అడవిలో నడిచేటప్పుడు, "కృష్ణా, కృష్ణా నాకు భయంగా వుంది" అని పిలిచాడు. వెంటనే దేవుడు బాలుని రూపంలో ప్రత్యక్షమై అతన్ని అడవి దాటించాడు. ఇలా రోజూ రాధీశ్ కృషుణ్ణి పిలవడం, బాలుని రూపంలో వున్న కృష్ణుడితో ఆదుకోవడం మొదలుపెట్టాడు. 

ఒక రోజు గురువుగారి ఆశ్రమంలో పెద్ద పూజ జరగనుంది. చాలా పెద్ద విందును ఏర్పాటు చేసారు. రాధీశ్ తోటి శిష్యులందరు బుట్టలకొద్దీ పళ్ళు తేవాలని, బిందెల నిండా నెయ్యి, పాలు తేవాలని మాట్లాడుకున్నారు. రాధీశ్ తన తల్లిని అడిగినప్పుడు అంతంత కానుకలు ఇచ్చే స్తోమత మనకు లేదని చెప్పింది విమలమ్మ. నిరాశతో, తన తోటి విద్యార్థులు, గురువు ఎక్కడ హేళన చేస్తారో అనే బాధతో అడవి దాటుతూ ఆశ్రమం వైపుకి వెళ్ళాడు. 

ఎప్పటిలాగానే, అడవిలోకి కృష్ణుడు వచ్చాడు. "రాధీశ్ ఎందుకు బాధ పడుతున్నావ్?" అని అడిగాడు. జరిగిన విషయమంతా వివరించాడు రాధీశ్. కృష్ణుడు ఒక చిన్న గిన్నెలో పాలిచ్చి "ఇది మీ గురువుగారికి ఇవ్వు" అని చెప్పాడు. రాధీశ్ ఆశ్రమం చేరాడు. తోటి విద్యార్థులందరూ పెద్ద పెద్ద బిందెల నిండా, గంగాళాల నిండా పాలను తెచ్చారు. రాధీశ్  తెచ్చిన చిన్న గిన్నెను చూసి తోటి శిష్యులంతా హేళన చేసారు. గురువుగారు ఆ గిన్నెను స్వీకరించి ఒక గంగాళంలొ  పోశారు. ఆశ్చర్యం! అది నిండిపోయింది. గిన్నెలో ఇంకా పాలున్నాయి! ఇంకో గంగాళంలో పోశారు. అదీ నిండిపోయింది. ఆలా ఆ గిన్నెలో పాలు అక్షయమవుతూనే వున్నాయి. గురువుగారు, విద్యార్థులు చాలా ఆశ్చర్యపోయారు. 

గురువుగారు రాధీశ్ ని "ఆ పాలు ఎవరిచ్చారు?" అని అడిగారు. రాధీశ్ జరిగిన విషయమంతా చెప్పినప్పుడు గురువుగారు "రాధీశ్ నీకు అడవిలో రోజూ కలిసే బాలుడు ఎవరో కాదు. శ్రీ కృష్ణ పరమాత్ముడే. నువ్వు ఎంత కానుక తెచ్చావు అనేది ముఖ్యం కాదు ఎంత భక్తితో ఇస్తున్నావనేదే ముఖ్యం" అన్నారు. తోటి విద్యార్థులు రాధీశ్ ని హేళన చేసినందుకు సిగ్గుతో తలవంచుకున్నారు.  

ముందు చూపు - Foresight

 

ముందు చూపు

చంద్రపురి రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పరిపాలించేవాడు. విక్రమవర్మ ఒక రోజు తన మంత్రితో రాజ్యంలో సంచారం చేస్తూ ఒక తోట దగ్గరకు వచ్చాడు. 

అక్కడ ఆయనకు ఒక వృద్ధుడు కనిపించదు. ఆ వృద్ధుడి వయస్సు ఎనభై సంవత్సరాలకు దగ్గరగా ఉంటుంది. వణికే చేతులతో ఆయన ఒక మామిడి మొక్కను నాటుతున్నాడు. 

విక్రమవర్మ ఆ ముసలి తాతను ఉద్దేశించి "తాతా ! ఈ తోటలో నువ్వు పని చేస్తున్నావా? లేక ఇది నీ సొంత భూమా? " అని అడిగాడు. 

దానికి ఆ వృద్ధుడు "మహారాజా! ఇది నా తాత ముత్తాలనాటి  భూమి" అన్నాడు. విక్రమవర్మ "మరి అంత కష్టపడి మామిడి మొక్కను నాటుతున్నావేం? నువ్వు ఇప్పుడు నాటిన మామిడి మొక్క పెరిగి చెట్టై పండ్లు కాయడానికి చాల సంవత్సరాలు పడుతుంది. ఆ పండ్లను తినడానికి నువ్వు బతికుంటావనే నమ్మకం నీకుందా?" అని అడిగాడు చిన్నగా నవ్వుతూ. 

దానికి ఆ ముసలితాత "నేను ఇన్ని రోజులూ నా తాత ముత్తాతలు నాటిన చెట్ల పండ్లను తిన్నాను. నేను నాటిన చెట్ల పండ్లను నా తరువాత తరం వారు తింటారు. మనం నాటిన చెట్ల పండ్లను మనమే తినాలి అనుకోవడం స్వార్థమవుతుంది" అన్నాడు. 

విక్రమవర్మ ఆ సమాధానికి సంతోషించాడు. ఆ ముసలి తాతను తన భవనానికి పిలిచి సత్కరించాడు. 

ఆకలి కాయల పులుసు

 

ఆకలి కాయల పులుసు

మధురాపురి రాజ్యానికి భీమసేనుడనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజన ప్రియుడు. చాల పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంట వారిని నియమించాడు. నాలుగు పూటలూ రకరకాల వంటలను తిని ఆనందించేవాడు. అయితే రోజుకో కొత్త రకం వంటకు, రుచికరమైన భోజనానికి అలవాటుపడి ఆకలి అనే పదానికి అర్థం తెలియని రాజుకు రానురాను ఏ వంటకం రుచించకుండా పోయింది. ఏదైనా అతిగా చేస్తే అంతేమరి! ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలు పెట్టాడు. 

ప్రసిద్ధిచెందిన వంటివారు వండినప్పటికీ, రుచిగా లేదని శిక్షించాడు. ఆలా ఆఖరికి, రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది. 

అక్కడి ఆస్థానంలో పని చేసేవారే రాజుకు వంట చేయడానికి వంతులు వేసుకున్నారు. వంటవారి కోసం రాజ్యమంతా వెతికిన భీమసేనుని తృప్తి పరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు. 

ఆఖరికి పొరుగు దేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయడానికి సిద్దమయ్యాడు. ఆస్థానానికి వచ్చినప్పుడు భీమసేనరాజు "ప్రపంచంలో నేను ఎన్నడూ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా?" అని అడిగాడు. 

అప్పుడు ఆ యువకుడు "మహారాజా మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి వుంది. దాని పేరు ఆకలి కాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి. కోసిన వెంటనే వండాలి  కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు" అన్నాడు. రాజుకు కొత్త వంటకం గురించి విని నోరూరింది. ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు. 

ఆలా పొద్దున్నే బయలు దేరిన వాళ్ళు  సాయంత్రం  అయినా నడుస్తూనే వున్నారు. రాజుకు చాలా ఆకలి వేయసాగింది. "ఇంకా ఎంత దూరం?" అని అడగడం మొదలు పెట్టాడు. ఆఖరికి యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు. "మహారాజా, ఇదే ఆకలి కాయల పులుసు" అన్నాడు. భీమసేనుడు ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచించింది. అలంటి పులుసు తాను ఎన్నడూ తినలేదు అన్నాడు. 

అప్పుడు యువకుడు "మహారాజా! ఇది మామూలు ఉల్లిపాయలు పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది. ఆకలి లేని వారికీ పంచభక్ష్య పరమాన్నమైనా రుచించదు. అదే ఆకలితో వున్నా వారికీ ఎలాంటి భోజనమైన రుచిస్తుంది." అని చెప్పాడు. రాజుకు తన పొరపాటు తెలిసివచ్చింది. ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు.